తమిళ బడ్జెట్ లో భారత రూపాయి “₹” (Rupee Symbol) గుర్తుకు బదులుగా ‘రూ’ (ரு என்று) గుర్తును వాడారు. ఇది కేంద్రప్రభుత్వం హిందీ రుద్దడానికి వ్యతిరేకంగా తమిళనాడు సర్కారు సమాధానంగా చూడవచ్చనే చర్చ మొదలైంది.
ఎమ్.కే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం గురువారం రాష్ట్ర 2025-26 బడ్జెట్ లోగోలో రూపాయి చిహ్నమైన “₹” ను తమిళ లిపిలోని “రూ” (ரு என்று) తో భర్తీచేసింది. తమిళనాడు ప్రభుత్వం మార్చి 14న ప్రవేశపెట్టడానికి ముందు ఈ చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఎన్ఈపీ త్రి భాషా విధానంపై విభేదిస్తున్నాయి. ఇలాంటి సంయంలో తమిళనాడు సర్కారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అంగీకరించేది లేదనే సంకేతాలు పంపుతూ, రూపాయి సింబల్ ను తమిళ అక్షరం రూ తో రీప్లేస్ చేయడం గమనించాల్సిన విషయం. తమిళనాడు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు శుక్రవారం 2025-26 బడ్జెట్ను సమర్పించనున్నారు.
తమిళనాడులో మూడు భాషల విధానాన్ని అమలుచేయడానికి కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అదే సమయంలో పాఠశాల పాఠ్య ప్రణాళికలో హిందీ భాషను చేర్చడానికి తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. దీని కారణంగా తమిళనాడుకు రావాల్సిన 2,152 కోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వం నిలిపివేసిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ సమస్యపై పార్లమెంటులో డీఎంకే ఎంపీలు నిరసనలు చేస్తున్నారు. ఇంకా డీఎంకే – బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య స్టాలిన్ సర్కారు శుక్రవారం తమిళనాడు బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో చాలా ముఖ్యమైన ప్రకటనలు వస్తాయని భావిస్తున్నారు.