NEET పరీక్షల వల్ల ఇటీవల తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన NEET వ్యతిరేక బిల్లును ఆమోదించాలని ఆయన కోరారు. NEET పరీక్ష వల్ల తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 16కి చేరిందని ఆయన పేర్కొన్నారు.
NEET మినహాయింపు బిల్లును ఆమోదించడం వల్ల విద్యార్థుల మరణాలు పునరావృతం కాకుండా నివారించవచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా, NEET పరీక్షను రెండుసార్లు రాసి, కానీ ర్యాంకు రాలేదనే మనస్తాపంతో ఒక విద్యార్థి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల బిల్లు 2021కి అనుమతి మంజూరులో ఆలస్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు చోటుచేసుకున్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే, వెంటనే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజ్ఞప్తి చేశారు. NEET పరీక్షల ఒత్తిడి కారణంగా ఆగస్టు 12, 13వ తేదీల్లో కొడుకు, తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలను కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు.
ఈ బిల్లుకు సంబంధించిన శాసన ప్రక్రియను ప్రస్తావించిన ముఖ్యమంత్రి స్టాలిన్, NEET ఆధారిత ప్రవేశ ప్రక్రియ వల్ల పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని జస్టిస్ AK రాజన్ కమిటీ అధ్యయనం ద్వారా వెల్లడించారు.
ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, 2021 సెప్టెంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించిందని ఆయన తెలిపారు.
ఇటువంటి పరిణామాల్లో, MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే NEET పరీక్ష నుండి తమిళనాడు రాష్ట్రాన్ని శాశ్వతంగా మినహాయించాలని తమిళనాడు ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.