అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై టాటా గ్రూప్ స్పందించింది. ఈ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆ యా కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామని టాటా గ్రూప్ సంస్థ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వెల్లడించింది. ఈ మేరకు గురువారం టాటా గ్రూప్ ఎక్స్ వేదికగా స్పందించింది.
మరోవైపు ఈ ప్రమాద ఘటన నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. 11ఏ సీటు ప్రయాణికుడు రమేశ్ బతికారన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన రమేశ్ బిశ్వాస్కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని వివరించారు. ఈ ప్రమాద మృతుల సంఖ్యపై ఇప్పడే తామేమీ చెప్పలేమన్నారు. నివాస ప్రాంతంలో విమానం కూలినందున మృతుల సంఖ్య ఎక్కువే ఉండ వచ్చని అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ అభిప్రాయపడ్డారు.
జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1.39 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఆ కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 241 మంది మరణించారు. వీరిలో 229 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదగా లండన్కు ఈ విమానం వెళ్తోంది. మరోవైపు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడులు వేర్వేరుగా అహ్మదాబాద్కు చేరుకుని ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.