తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంఛార్జ్ మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని సూచించినా.. ఆ పని చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని చెప్పారు. అయితే మంత్రులు నిధులను కూడా సరిగా ఉపయోగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం (జూన్ 24) జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సంజదర్భందా ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం అన్నారు. గాంధీ భవన్లో పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బూత్, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు నిర్దేశించారు. త్వరలో మార్కెట్, టెంపుల్ కమిటీల్లో నామినేషన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాని.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు తమ ముందుకు రానున్నట్లు చెప్పారు. ఇక ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఖాళీ అయిన ఆ స్థానంలో ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఆ స్థానంలో అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని.. ఎవరికి వారు తామే అభ్యర్థులమని చెప్పుకోవద్దన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్.. బూత్, గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే.. ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్థంగా తీసుకెళ్లగలుగుతామన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని, పార్టీ నాయకులంతా ఒక్కటిగా పని చేయాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేలా చేయాలని చెప్పారు. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు క్షేత్ర స్థాయిలో పని చేయాలని చెప్పారు. పని చేసినవారికే పదవులు వస్తాయని.. పార్టీని కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని తెలిపారు. పార్టీ పదవులను తక్కువ చేసి చూడొద్దన్నారు. పార్టీ పదవుల్లో ఉండి నిర్లక్ష్యం చేస్తే మనకే తీరని నష్టం చేస్తుందన్నారు. ఇలా చిత్తశుద్దితో పని చేస్తే భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఎదుగుతారని సూచించారు.