తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం సిద్దమైంది. ఈ నెల 30 లేదా 31 తేదీల్లో విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీపీసీసీ కార్యవర్గం కూర్పు ఖరారైంది. ఢిల్లీలో సీఎం రేవంత్ పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్తో పీసీసీ చీఫ్ తో కలిసి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు రాహుల్ లో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నట్లు తెలిసింది. వీరి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ లో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలోనూ సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతాల సమతుల్యత పాటించాలని డిసైడ్ అయ్యారు.
వారంరోజుల్లో మంత్రివర్గ విస్తరణతో పాటు.. పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. కేసీ వేణుగోపాల్తో భేటీ సందర్భంగా కొత్తగా మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించడంపై నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. కుల గణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ, అదేబాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కాగా, ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పదవిపై మాత్రం సందిగ్ధత నెలకోగా. .ఈ రోజు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. ఇక.. మంత్రివర్గంలో ఒకరిద్దరికి స్థానచలనం తప్పదనే చర్చ వినిపిస్తోంది. మంత్రులు గా తెలిగించిన వారికి పార్టీలో బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురైన మంత్రితో పాటుగా.. మరో మంత్రి పేరు తెర మీదకు వస్తోంది. కాగా, సామాజిక సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత లేఖపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై ఇప్పటికే తుది జాబితాను ఖరారు చేయగా, దాన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆమోదించాల్సి ఉంది. ఈ రోజు ఈ మేరకు తుది ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది.