వాయిదాలు పడుతూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకో వారంరోజుల్లో కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
ప్రస్తుతం మంత్రివర్గంలో నలుగురికి అవకాశం కల్పించడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే చాన్స్ ఉన్నట్టు అభిప్రాయపడుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలకు అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. మహబూబ్నగర్ జిల్లా నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్రెడ్డిల పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి నలుగురికే చోటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో రెండు మంత్రి పదవుల భర్తీపై ఎలాంటి చర్చా జరగలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
మంత్రివర్గంలో ఎస్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్ కీలకంగా వినిపిస్తోంది. దీనిపైనా చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రివర్గంలో ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేని పక్షంలో డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ స్పష్టం చేశారు. విస్తరణ, పీసీసీ పదవులు, సంక్షేమ పథకాలపై అధిష్ఠానం పెద్దలతో చర్చించామన్నారు. అన్ని విషయాలను వారికి వివరించామని అన్నారు.