ఒకే మంత్రి, ఒకే ప్రభుత్వం, ఒకే ఉత్తర్వు, కానీ మాటలు మాత్రం వేర్వేరు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణం చెల్లించిన తర్వాత రూ.2 లక్షలు ఖాతాల్లో జమ చేస్తామన్న అదే నోటితో, నేడు అసలు రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ చేస్తామని తాము హామీ ఇవ్వలేదని, తమ ప్రభుత్వ నిర్ణయం కాదంటూ అదే మంత్రి తప్పించుకుంటున్నారు. తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఇచ్చినమాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిచేసితీరుతామంటూ ఫోజులు కొట్టిన CM, మంత్రులు ఇప్పుడు రుణమాఫీ చేయలేక చేతులెత్తేశారు. పూటకో మాట, గడువుకో లెక్క చెప్తూ రైతులను నిండాముంచారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల సాక్షిగా రూ.2 లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం చరమగీతం పాడింది.
కాంగ్రెస్ సర్కారు వస్తే తమకు రూ.2 లక్షల రుణమాఫీ అవుతుందని కొండంత ఆశపడిన రైతులను పచ్చిమోసం చేసి మొండిచెయ్యి చూపించింది. దీంతో రెండు లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లించి, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలు ఎప్పుడు మాఫీ అవుతాయోనని ఎదురుచూసిన రైతాంగం ఇప్పుడు కుతకుత ఉడికిపోతున్నది. ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నది. అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి ఏడు నెలల తర్వాత రుణమాఫీ హామీ గుర్తుకొచ్చింది. ఈ మేరకు 2024 జులై 15న రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో రూ.2 లక్షల లోపు రుణాలతోపాటు రూ.2 లక్షలకు పైగా ఉన్న వాటిలో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఎప్పుడు ఏం మాట్లాడారు:
ఏ కుటుంబానికి అయితే రూ.2 లక్షలకు మించిన రుణం ఉంటదో, ఆ రైతులు రూ.2 లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల రూ.2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
– ఇదీ 2024 జులై 15న ప్రభుత్వం జారీచేసిన రుణమాఫీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొన్న అంశం.
రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రూ.2 లక్షల పైగల రుణాన్ని రైతులు బ్యాంకులకు చెల్లిస్తే, ఆ మరుక్షణమే రూ.2 లక్షలను ఖాతాలో వేసే బాధ్యతను నేనే తీసుకుంటా.
-2024 సెప్టెంబర్ 15న గాంధీభవన్లో CM రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయ్యాక ఆపై రుణాలకు షెడ్యూల్ ప్రకటిస్తాం. 2.5 లక్షల వరకు ఎప్పుడు చెల్లించాలి, 3 లక్షలు ఉన్నవారు ఎప్పుడు చెల్లించాలో తేదీలు ప్రకటిస్తాం. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో రూ.2 లక్షలు జమచేస్తాం.
– 2024 సెప్టెంబర్ 24న ఖమ్మంలో మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు
రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలనేదే ప్రభుత్వ నిర్ణయం. రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ నిర్ణయం లేదు. 2 లక్షలలోపు రుణాలున్న 25.35 లక్షల మంది రైతుల వివరాలు మా వద్దకు చేరాయి. వారికి 20,616 కోట్లు జమ చేసినం.