రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచే కృత్రిమ మేధ(ఏఐ) పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు గణితంలో ఒక పాఠంగా ఏఐని చేర్చేందుకు చర్యలు చేపట్టింది. 1-5 తరగతుల వరకు 2-3 పేజీల్లో… ఆరు నుంచి 9వ తరగతి వరకు 4-5 పేజీల్లో ఏఐ పాఠ్యాంశం ఉండనుంది. పాఠశాల విద్యాశాఖలోని ఓ అదనపు సంచాలకుడు, ఎస్సీఈఆర్ సబ్జెక్టు నిపుణులతో ఏఐ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. ఇవి సిద్ధమయ్యేందుకు 15-20 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.
కంప్యూటర్, ఏఐ పుట్టుపూర్వోత్తరాలు, ప్రస్తుతం ఎక్కడ వినియోగిస్తున్నారు? కొన్ని ఉదాహరణలు చేర్చనున్నారు. సీబీఎస్ఈలో దాదాపు నాలుగేళ్ల క్రితమే ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏఐ పాఠాలు చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు.. మెరుగైన అభ్యసన పద్ధతుల కోసం బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏక్స్టెప్ ఫౌండేషన్ సహకారంతో ఏఐ టూల్స్, ప్లాట్ఫాంలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర సర్కారు ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.