హైదరాబాద్ ఐటీ హబ్కు అతి సమీపంలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదాయన్ని సమకూర్చుకునేందుకు గాను.. ఎకరాకు రూ.50 కోట్ల చొప్పున విక్రయించి మెుత్తం రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ భూమికి సంభందించి మాస్టర్ లే ఔట్ డిజైన్ చేసి విక్రయించేందుకు గాను ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) రంగంలోకి దిగింది. భూముల వేలానికి బిడ్డింగ్ ప్రక్రియ కూడా ఇదివరకే మొదలైంది. ఈ నేపథ్యంలో భూముల వేలంపై పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు.
కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అనేక జంతువులు, వివిధ రకాల పక్షులకు ఆవాసంగా ఉందని అంటున్నారు. ఈ అటవీ ప్రాంతంలో దాదాపు 237 రకాల పక్షులు, అరుదైన స్టార్ తాబేళ్లు, డీర్స్, వైల్డ్ బోర్స్, ఇండియన్ రాక్ పైథాన్, వైపర్స్, కోబ్రాస్, బోయాస్, క్రైట్స్ వంటి జంతువులు, సరీసృపాలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న అర్బన్ ఫారెస్ట్లో ఇదీ ఒకటని చెబుతున్నారు. దీన్ని నాశనం చేయటం ద్వారా పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలకు ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారు. అందులోని జంతువులు ఎక్కడికెళ్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో పీకాక్ సరస్సు మరియు బఫెలో సరస్సు కూడా ఉన్నాయి, ఇవి అనేక పక్షులకు ముఖ్యమైన నీటి వనరులు మరియు గూడు స్థలాలుగా పనిచేస్తాయి.
పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అడవిని నాశనం చేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, వాయు కాలుష్యం తీవ్రతరం కావడం, వర్షపాతం తగ్గడం, నగరాల్లోకి స్థానభ్రంశం చెందిన జంతువులు ప్రవేశించడం వల్ల మానవ-వన్యప్రాణుల సంఘర్షణ ప్రమాదం పెరుగుతుంది. ఈ అడవి వాతావరణ మార్పులను నియంత్రించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు భూగర్భ జలాలను తిరిగి నింపడం ద్వారా నీటి భద్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ పచ్చని స్థలాన్ని తొలగించడం వల్ల హైదరాబాద్ వేసవికాలం వేడిగా మారుతుంది, కాలుష్యం మరింత తీవ్రమవుతుంది మరియు నీటి కొరత పెరుగుతుంది. వాతావరణ మార్పు పెరుగుతున్న సంక్షోభంగా ఉన్న సమయంలో, పర్యావరణం కంటే రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యత ఇవ్వడం బాధ్యతారాహిత్యం మరియు ఆమోదయోగ్యం కాదు అంటున్న పర్యావరణ నిపుణులు. ఈ పోరాటం కేవలం 400 ఎకరాల భూమి గురించి కాదు – ఇది హైదరాబాద్ భవిష్యత్తు, దాని ప్రజలు మరియు రాబోయే తరాలకు సంబంధించినది.
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ‘సేవ్ సిటీ ఫారెస్ట్’ అనే బృందం ఇప్పటికే కంచ గచ్చబౌలి ఫారెస్ట్ ఏరియాను సందర్శించింది. వారు ఆ భూమిని, అందులోని జీవ జాతులను కాపాడటానికి ఒక ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. న్యాయవాదులు, పర్యావరణవేత్తలతో కలిసి పనిచేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూములను వేలం వేయటానికి తాము ఒప్పుకోమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.