మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సహా విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలు, వాటి ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై జూన్ 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్దం చేస్తోన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. బ్యారేజీల్లోని లోపాలు, చేయాల్సిన పరీక్షలు, తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చింది. అందులో పలు అంశాలను పేర్కొన్నారు. మూడు బ్యారేజీలకు వివిధ పరీక్షలు చేయాలని సూచించారు. ఆ పరీక్షలు చేసి లోపాలు, కారణాలపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, అందుకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆదివారం ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో విస్తృత చర్చ జరిగింది. తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న విషయమై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. గ్రౌటింగ్ చేయడం వల్ల లోపాలు, వైఫల్యాలకు సంబంధించి పూర్తి అవగాహన వచ్చే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొన్న అంశాలపైనా మంత్రుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
అసలు గ్రౌటింగ్ ఎందుకు చేశారు? ఎవరు నిర్ణయం తీసుకున్నారని కొందరు అడిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో విజిలెన్స్ నివేదిక కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ మార్చిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలు ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు ఉన్నారు.
అధికారులపై చర్యలు : 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ విధించాలని సిఫారసు చేసింది. అప్పటి ఆర్థిక, నీటిపారుదల శాఖల అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలన్న విజిలెన్స్ ఏడో బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని కూడా రాబట్టాలని తెలిపింది. విజిలెన్స్ సిఫార్సులపై కూడా మంత్రులు చర్చించినట్లు తెలిసింది.