పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లింపులో జరుగుతున్న జాప్యంతో దాఖలవుతున్న పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాట్యుటీతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లింపు దాతృత్వం కాదని, అవి ఉద్యోగులు సంవత్సరాల తరబడి కష్టపడి, క్రమశిక్షణతో సంపాదించి దాచుకున్న సొమ్మని పేర్కొన్నారు. పదవీ విరమణ కోసం దాఖలవుతున్న పిటిషన్లపై విచారణ సందర్భంగా ఉచిత విద్యుత్తు, నీరు, రవాణా, వ్యవసాయ రుణాల మాఫీ, ఇతర సబ్సిడీల పేరుతో నిధులను సంక్షేమ చర్యల్లో భాగమంటూ నేతలు ఏకపక్షంగా మళ్లిస్తున్నారని అన్నారు. ఇది ఖజానాపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని న్యాయవాదులు చెబుతున్నా ఇవన్నీ శాసన విధాన నిర్ణయాల పరిధిలోకి వస్తాయని, న్యాయసమీక్షకు అతీతంగా ఉంటాయని, అందువల్ల ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు.
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలు చెల్లించకుండా ప్రభుత్వం కారణాలు చెబుతూ వస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఉచితాలకు ప్రజాధనాన్ని కేటాయిస్తూ, ఆర్థిక స్థితిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. సుప్రీం కోర్టు కూడా ఈ విషయాల్లోకి వెళ్లడానికి సంకోచించినప్పటికీ, రాజకీయ పార్టీలు ఆర్థిక వనరులపై స్పష్టతలేకుండా పథకాలను ప్రకటించడం, అవి దేశ ఆర్థిక సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలోని ప్రజల శ్రేయస్సు కోసం ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
పదవీ విరమణ చేసి ఆరు నెలలై అన్ని బిల్లులు ఆమోదం పొందినప్పటికీ చెల్లింపుల్లో జాప్యంపై సహాయ ఇంజినీరు ఎ.నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ 40 ఏళ్ల సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా సేవలందించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పదవీ విరమణానంతర ప్రయోజనాల కోసం బిల్లులు పంపితే, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామనే దశలో అగిపోయాయన్నారు. పదవీ విరమణ చేసి 4 నెలలు అయినా, ఆగస్టులో టోకెన్ జారీచేసినా ఇప్పటివరకు సొమ్ము విడుదల చేయలేదని, గ్రాట్యుటీ చట్టం సెక్షన్ 3 ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెలించాలన్నారు. ఈ వడ్డీ 10 శాతం ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొందన్నారు. చెల్లింపు ప్రక్రియ మొదలైందని, నిధుల కొరత వల్ల విడుదల చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. సీరియల్ నెంబరు వారీగా నిధుల విడుదల జరుగుతోందన్నారు.వాదనలను విన్న న్యాయమూర్తి పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యంపై హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లపై నిర్దిష్ట కాలంలో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్లపై విచారణను మూసి వేస్తోందన్నారు.