విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్నది.. రూ.7,500 కోట్లకు పైగా ఫీజు బకాయిలు పేరుకుపోయాయి.. ఒకవైపు విద్యార్థుల రోదన.. మరోవైపు కళాశాలల యాజమాన్యాల వేదన.. అయినా కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడమే లేదు. గతంలో విద్యాసంస్థలు మూసి నిరసన తెలిపిన విద్యాసంస్థల యాజమాన్యాలు, గత మార్చిలో జరగాల్సిన పరీక్షలనే బహిష్కరించి నిరసనకు దిగాయి. ఫలితంగా విద్యార్థులు నలిగిపోతున్నారు. మొత్తంగా ఉన్నత విద్య సందిగ్ధంలో కూరుకుపోయింది. బకాయిల కోసం యాజమాన్యాలు ఒకవైపు కళాశాలలను బంద్ పెట్టినా, రోడ్డెక్కి నిరసన తెలిపినా కాంగ్రెస్ సర్కారులో చలనం లేదు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీతోపాటు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలకు సర్కార్ నిధుల విడుదలను పూర్తిగా నిలిపేసింది.
రేవంత్రెడ్డి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు చేసేదేమీలేక మార్చి నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలనే బహిష్కరించాయి. కళాశాలలను నిర్వహించలేని దుస్థితి నెలకొన్నదని, అద్దెల కోసం భవనాల యజమానులు ఒత్తిడి చేస్తున్నారని, సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొన్నదని విజ్ఞప్తి చేశాయి. కాలేజీ యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలను బహిష్కరించడంతో ఉన్నత విద్య ప్రవేశాలపై ప్రభావం చూపనున్నది. డిగ్రీ పరీక్షలను నిర్వహించడంతోపాటు, ఫలితాలను వెల్లడించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నది. అదే జరిగితే విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోతారని విద్యావేత్తలు వివరిస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు, కాలేజీ యాజమాన్యాలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. అయినా సర్కారు స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దలు హామీలిస్తున్నారే తప్ప ఆచరణలో చూపడంలేదు. బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని చెప్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే వన్టైం సెటిల్మెంట్ కింద చెల్లింపులు చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు అమలు చేయలేకపోయింది.
ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో దాదాపు 10 లక్షల మంది నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజులు చెల్లించనిదే ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదని వాపోతున్నారు. దీంతో సొంతంగా జేబుల నుంచి కొందరు విద్యార్థులు, అప్పులు చేసి మరికొందరు కాలేజీలకు ఫీజులను చెల్లిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఆ స్థోమత కూడాలేని నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారని విద్యార్థిసంఘాలు వివరిస్తున్నా యి. ఉన్నత విద్యను పూర్తిచేసుకున్నా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదని, దీంతో ఉద్యోగావకాశాలు వచ్చినా వాటిని పొందలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు సైతం ఫీజులు చెల్లించకపోతే కళాశాలలను ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తున్నాయి. మొత్తంగా అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ యాజమాన్యాల నడమ నిరుపేద విద్యార్థులు బలవుతున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.