తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 692 మందికి పోలీస్ సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఆదివారం ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పోలీస్, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ, ప్రత్యేక పోలీస్ దళం (ఎస్పీఎఫ్) లకు చెందిన సిబ్బంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో 9 మందికి శౌర్య పతకాలు, 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 92 మందికి ఉత్తమ సేవా పతకాలు 47 మందికి కఠిన సేవా పతకాలు, 461 మందికి సేవా పతకాలు ప్రకటించారు. ఇక అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురుకి ఉత్తమ సేవా పతకాలు, 17 మందికి సేవా పతకాలు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా రాష్ట్రం పన్నెండో సంవత్సరంలోకి అడుగుపెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేలా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారందరికీ ఘన నివాళులర్పించారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిపామని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మరింత ప్రగతిని సాధించాలని, సకలజనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, పార్లమెంటరీ పంథాలో తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు. అమరుల త్యాగాలను వృథా పోనీయకుండా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.