కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో కృత్రిమ మేధ (AI) ఆధారిత నకిలీ వీడియోలు, ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్న తీరు పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే AI ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించాలనే ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, రాష్ట్రంలో సైబర్క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నకిలీ వీడియోలు, ఫొటోలను గుర్తించే విధంగా అవసరమైన ఆధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ను సమకూర్చుకోవాలని సూచించారు.
శనివారం ఆయన కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, CS శాంతికుమారి, DGP జితేందర్, TGIIC MD విష్ణువర్ధన్ రెడ్డి, అటవీశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కృత్రిమ మేధతో తయారు చేసిన నకిలీ వీడియోలు, ఫొటోలు కరోనాను మించిన మహమ్మరిలాంటివి అని, ఇండో-పాక్, ఇండో-చైనా వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాలలో AIతో ఫేక్ కంటెంట్ను సృష్టించడానికి ప్రమాదం ఉందని చర్చ జరిగింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కున్నట్టుగా సోషల్ మీడియా నెట్వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై CM స్పందిస్తూ, ఫేక్ కంటెంట్ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు CM రేవంత్కు పలు కీలక విషయాలను వెల్లడించారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా టాండన్ వంటి వారు కూడా AI ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోలను పోస్టుచేసి సమాజానికి తప్పుడు సందేశాన్ని చేరవేశారని సమావేశంలో చర్చించారు. అయితే ఈ భూముల వివాదంపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లలోనే తన పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పారని, మిగతా ప్రముఖులు ఎవరు ఈ నిజాన్ని గుర్తించకుండా ఫేక్ వీడియోలను ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు.
మొత్తంగా, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో AI సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెద్ద సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.