ఆగష్టు 15 నాటికి భూ భారతి చట్టం ద్వారా ప్రతీ రైతుకు భద్రత కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. అసైన్డ్ కమిటీలు వేసి భూములను ప్రజావసరాల కోసం వినియోగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నాట్లు పడకముందే రైతు భరోసా నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సదస్సు నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు. భూభారతి చట్టంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ములుగుమాడులో చేపట్టిన భూముల రీసర్వేను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో చేపట్టబోయే భూముల రీసర్వే ప్రక్రియను మంత్రులు పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రులు మాట్లాడారు. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అధికారులే వచ్చి పరిష్కరిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలోని 413 గ్రామాల్లో నక్షాలు లేవని, అందుకే రాష్ట్రంలో ఎంపిక చేసిన 5 గ్రామాల్లో భూముల రీ సర్వే చేపట్టినట్లు వివరించారు. ఈ గ్రామాల్లో 20 రోజుల పాటు సర్వే నిర్వహించి నక్షాలు తయారుచేయడమే కాకుండా రైతులు, కమతాల వారీగా నక్షా అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూమి లేకుండా ఉన్నట్లు చిత్రీకరించి లక్షల ఎకరాలకు రైతుబంధు పొందారని ఆరోపించారు. ధరణి పేరుతో అక్రమంగా కట్టబెట్టిన భూముల లెక్కలు తీస్తున్నామన్నారు.
రాష్ట్రానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు భూ సంస్కరణ చట్టాలు వస్తే కాంగ్రెస్ తెచ్చిన మూడు చట్టాలతో ప్రజలకు న్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత సర్కార్ తెచ్చిన ధరణి చట్టంతోనే తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. భూమిలేని పేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలను భూభారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తామని భట్టి తెలిపారు. భూసమస్యల పరిష్కార ప్రక్రియను ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాట్లు పడకముందే ఈసారి రైతుభరోసా నగదును ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.