తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ల కొనసాగింపుపై నిర్ణయాన్ని యూనివర్సిటీల ఇష్టానికే వదిలేసినట్లు తెలుస్తున్నది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశంలో చర్చించి డిసిషన్ తీసుకోవాలని విద్యాశాఖ సూచించినట్లు సమాచారం. ఈసీ నిర్ణయానికి అనుగుణంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తామని సంకేతాలు పంపినట్లు చర్చ జరుగుతున్నది. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ స్టాఫ్ ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల జీవో 21 జారీ చేసింది. అయితే ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని, లేకపోతే కనీసం టైమ్ స్కేల్ ఇవ్వాలని కాంట్రాక్టు టీచర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తుది నిర్ణయాన్ని వర్సిటీలకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
కాంట్రాక్టు టీచింగ్ స్టాఫ్ ను కొనసాగించడం, లేకపోతే వారిని తప్పించి రెగ్యులర్ స్టాఫ్ ను భర్తీ చేయడం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ విద్యాశాఖ మాత్రం వర్సిటీల నిర్ణయానికి వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు టీచింగ్ స్టాఫ్ ఎన్నో ఏండ్ల నుంచి పని చేస్తున్నారు. ఉన్నపళంగా వారందరినీ తప్పిస్తే రాజకీయ విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఈ విషయంపై విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం పరిధిలోనే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యాశాఖ మాత్రం కాంట్రాక్టు టీచింగ్ స్టాఫ్ అంశంపై ఈసీలో చర్చించి ప్రపోజల్ ను తమకు పంపాలని వర్సిటీలకు సంకేతాలు ఇచ్చింది. దీని వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని టాక్ ఉంది. ఎందుకంటే వర్సిటీలు కాంట్రాక్టు లెక్చరర్లను కంటిన్యూ చేయమని తీర్మానం చేసి పంపడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కాంట్రాక్టు లెక్చరర్లు చెబుతున్నారు.
విద్యాశాఖలో అవగాహన లేని అధికారుల తీరు వల్ల అనవసర సమస్యలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు జీవో జారీ చేసేముందు క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్లలేదని అనుమానాలు కలుగుతున్నాయి. వర్సిటీల్లో సుమారు 1500 మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. కానీ అధికారులు ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా, ఖాళీలన్నింటినీ భర్తీ చేయొచ్చని వివరించినట్లు తెలిసింది. దీంతో ఆయన వెంటనే ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అ తరువాతే కాంట్రాక్టు లెక్చరర్లు అందోళనకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని లేకపోతే టైమ్ స్కేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.