తెలంగాణ MLA అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. MLAల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ BR గవాయ్ స్పష్టం చేశారు. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పందించిన జస్టిస్ గవాయ్ ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు.
BRS కు చెందిన MLAలు పార్టీ మారిన వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని, ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశముంటుందని ముకుల్ రోహత్గీ కోర్టులో వాదించారు. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని రోహత్గీ తెలిపారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వాదనలు వినిపించారు.
రోహత్గీ వాదనలపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు చెప్పలేమా అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పీకర్కు విజ్ఞప్తి చేయడం లేదా ఆదేశించడమో చేయలేమా అని వ్యాఖ్యానించారు.
దీనిపై రోహత్గీ స్పందిస్తూ, MLAలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన వారిలో కొన్ని పిటిషన్లు న్యాయస్థానంలో వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ, కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు.
ముకుల్ రోహత్గీ వాదనలపై జస్టిస్ BR గవాయ్ జోక్యం చేసుకుని, న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని చెప్పారు. నాలుగేళ్ల పాటు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, కోర్టులు చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. ఫిరాయింపుపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని రోహత్గీ చెప్పారు. 10 మంది MLAలకు నోటీసులు జారీ చేసి, స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన కోర్టుకు వివరించారు.