ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) రాష్ట్ర కార్యవర్గం ఎంపిక మళ్లీ మొదటికొచ్చింది. ఇంతకాలం పేర్లు దాదాపు ఖరారైపోయాయని, నేడో, రేపో ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పీసీసీ కార్యవర్గం ఎంపిక తీరు మారింది. జిల్లాల వారీగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారెవరనేది తొలుత గుర్తించాలని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయినందున గతంలో, ఇప్పుడు పార్టీ నమ్ముకుని పని చేస్తున్నవారికి పదవులివ్వాలని కొత్త ఇన్ఛార్జి సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలు, ఇతరత్రా పలుకుబడి ఉన్నవారు పీసీసీలో కీలక పదవులు దక్కించుకునేందుకు గత మూణ్నెల్లుగా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వారిలో ఎవరిని ఎంపిక చేయాలనేది రాష్ట్ర నేతలకు కష్టంగా ఉండేది. కానీ రాహుల్ గాంధి ఆదేశాలతో రంగంలోకి దిగిన మీనాక్షి.. పార్టీ అధిష్ఠానం ఇచ్చే సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ పదవుల పందేరం చేపట్టాలని చెప్పినట్లు సమాచారం. ఒక్క పీసీసీకే కాకుండా.. మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా జిల్లాల వారీగా చేయనున్నారు.
అర్హులైన పార్టీ నేతలను గుర్తించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు పీసీసీ సూచించింది. వారు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చిస్తున్నారు. అనంతరం పేర్లతో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఇవన్నీ అందాక పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చర్చించి పీసీసీ రాష్ట్ర కార్యవర్గానికి తుది ప్రతిపాదనలు ఖరారు చేసి అధిష్ఠానం ఆమోదం కోసం పంపుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యక్రమాలను సైతం విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.