తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల కురిసిన వడగళ్ల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ముథోల్లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వడగళ్ల వాన కారణంగా వరి, మామిడి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. కాగజ్నగర్ పట్టణంలోని నాగౌంబస్తీలో ఇంటిగోడ కూలి చందెంకర్ దౌలత్ (79) అనే వృద్ధుడు మృతి చెందాడు.
నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి వడగళ్ల వాన కురిసింది. జూబ్లీహిల్స్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మియాపూర్, మదీనాగూడ, ప్రగతినగర్, బాచుపల్లి, బోరబండ, మధురానగర్, బోయిన్పల్లి, ప్యారడైజ్, గండిమైసమ్మ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది.
నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.