బంజారాహిల్స్ రోడ్ నెం.12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై ఇవాళ (గురువారం) హైకోర్టు విచారణ చేపట్టింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా భద్రపరచాలని సూచించింది. విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.
పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ నమోదైంది. అక్రమంగా కూల్చిన ఆలయాన్ని తక్షణమే నిర్మించాలని పల్లె వినోద్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం విగ్రహాన్ని భద్రపరిచి.. కూల్చివేతలకు గల ఆధారాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బంజారాహిల్స్లోని పెద్దమ్మగుడి కూల్చివేతపై కొద్ది రోజులుగా వివాదం సాగుతోంది. కూల్చివేతకు నిరసనగా హిందూ సంఘాలు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ఈ మేరకు గత మంగళవారం కుంకుమార్చాన పూజకు పిలుపునిచ్చారు హిందూ సంఘాల ప్రతినిధులు. ఈ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్కు వెళ్లే అన్ని మార్గాలనూ మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్దమ్మగుడి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కాగా, తాజాగా ఈ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.


