బెంగళూరులోని Kempegowda విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని (IndiGo aircraft) Traveller tempo ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మాత్రమే వాహనంలో ఉన్నాడు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ టెంపో ఆకాస ఎయిర్ సిబ్బందిని వారి కార్యాలయం నుంచి ఎయిర్ క్రాఫ్ట్ బే వద్దకు తీసుకురావడానికి వినియోగిస్తున్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. ఈ ప్రమాదం వల్ల పలు విమాన సర్వీసుల్లో స్వల్ప అంతరాయం కలిగిందని.. తర్వాత వాటిని పునరుద్ధరించామని అన్నారు.
ఈ ఘటనపై ఇండిగో స్పందిస్తూ.. బెంగళూరు ఎయిర్పోర్టులో ఆగి ఉన్న విమానాన్ని టెంపో ఢీకొట్టడంపై తమకు సమాచారం అందిందని ఈ విషయంపై జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు సమాచారం వెల్లడించినట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని.. ఈ విషయంపై ఎయిర్లైన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.