జమ్ము కాశ్మీర్లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు మృతి చెందగా, 9మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అనంత నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది.
అక్కడి సాక్షుల ప్రకారం పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో అనేక మందికి గాయాలయ్యాయి. “నా భర్త తలకు గాయమైంది. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు” అని ఓ బాధిత మహిళ PTI వార్తా సంస్థకు ఫోన్లో తెలియజేసింది. సదరు మహిళ తన వివరాలు వెల్లడించనప్పటికీ.. ఆసుపత్రికి తరలించాలని వేడుకున్నారు. బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమై భద్రతా బలగాలను అక్కడకు తరలించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. పహల్గాం ఆసుపత్రిలో 9 మంది బాధితులు చేరారని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అనంత్నాగ్ జిల్లాలో పహల్గాం మార్గంలోనే 48 కి.మీ మేర ఉండగా.. 14కి. మీ మార్గం గండేర్బల్ జిల్లా నుంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఆందోళన కలిగిస్తోంది.
జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ ఖండించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. ఈ దాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లోని ఘటనాస్థలానికి వెళ్లాలని.. తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు మోడీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. పర్యటకులపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.