జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లో 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 27 మంది పర్యాటకులు మరణించారు. కాగా మరో ఇరవై మంది వరకు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తున్నది. ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఈ దాడి చేసినట్లు వార్తలు వెల్లడించాయి. లష్కరే తోయిబా ఈ దాడి బాధ్యత వహించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. సమాచారం అందిన వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్కు వెళ్లినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ఇదే అతి పెద్ద ఉగ్ర ఘటన అని జమ్ము, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో మధ్యాహ్నం మూడు గంటలకు నలభై మంది పర్యాటకులని ఉగ్రవాదులు చుట్టుముట్టి ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపుమడుగులో పడివున్న మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. తమవారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు బైటికొచ్చాయి. ఇది ట్రెక్కింగ్, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అక్కడికి కేవలం కాలినడకన లేదా గుర్రాల మీద మాత్రమే వెళ్లడం సాధ్యం కనుక గాయపడ్డవారిని, మృతద్దేహాలను తరలించడం కష్టంగా మారింది. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో ఈ దాడిని నిర్వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.