ఆదివాసీ గిరిజనులు “జల్, జంగల్, జమీన్” (నీరు, అడవి, భూమి) కోసం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా, పీపుల్స్ వార్ ఆధ్వర్యంలోని గిరిజన రైతు కూలీ సంఘం (GRCS) 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ముందుగా అనుమతి ఇచ్చినా, తరువాత నక్సలైట్ ఉద్యమాల భయంతో అనుమతి రద్దు చేసింది .
సమావేశంలో విద్యార్థిగా పాల్గొన్న ప్రత్యక్ష సాక్షి, ఆదిలాబాద్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ కరీం మాటల్లో “మొదట పోలీసులు సమావేశానికి అనుమతి ఇచ్చారు. తర్వాత చివరి నిముషంలో అనుమతి రద్దు అన్నారు. అప్పటికే ఆదివాసీ గూడాల్లో విద్యార్థి, యువజన, రైతు సంఘాల ద్వారా సమావేశ తేదీపై ప్రచార సాధనాలు అంతగా లేని రోజుల్లో నోటిమాట ద్వారానే నెల రోజుల ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే సభకు అనుమతి రద్దు చేసారన్న విషయం అక్కడకు వచ్చిన వారిలో చాలా మందికి తెలియదు. పోలీసులు నిలువరించే లోపే ఇంద్రవెల్లికి వేల మంది జనం చేరుకున్నారు” అని ఆయన చెప్పారు.
“ఇంద్రవెల్లి వైపు దారులను మూసి బస్సులను అడ్డుకున్నారు. అరెస్టులు జరిగాయి. అంతలోనే జనం మధ్యలో అలజడి ప్రారంభమైంది. ఆ తర్వాత అరగంట పాటు పోలీసుల కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఇంద్రవెల్లి స్థూపం ప్రాంతంలో మామిడి చెట్లపై నుంచి పోలీసులు కాల్పులు జరిపారు. మేం అక్కడి నుండి పారిపోయాం. నెల రోజుల పాటు ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దం ఆవరించింది. పార్టీలు, ప్రజాసంఘాల పరామర్శలు వెల్లువెత్తాయి. కాల్పుల ఘటనతో కుగ్రామంగా ఉన్న ఇంద్రవెల్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది” అని ఆయన తెలిపారు.
ఈ ఘటనలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 13 మంది ఆదివాసీలు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రజలను నిలువరించే క్రమంలో జరిగిన ఘర్షణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ రోజు చనిపోయారు. ఆదివాసీల మరణాలు ప్రభుత్వం చెబుతున్న దానికన్నా ఎక్కువేననే వాదన ఉంది.
ఘటన చోటుచేసుకున్న మరుసటిరోజు హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ల బృందం ఇంద్రవెల్లి పరిసర గూడాలను సందర్శించి గాయపడ్డ వారికి చికిత్స అందించింది. ”కాల్పుల్లో గాయపడినవారు పోలీసుల భయానికి బయటకు రాలేదు. రెండు రోజులు కాలినడకన వెళ్లి గూడాల్లో వైద్య సేవలు అందించాం. బయటి ప్రాంత వ్యక్తులను నమ్మే పరిస్థితుల్లో వారు అప్పుడు లేరు. మెడలో స్టెతస్కోప్, మేం వేసుకున్న తెల్లని యాప్రాన్, చేతుల్లో మందులు, మెడికల్ కిట్లు చూశాకే ఆదివాసీలు డాక్టర్లను నమ్మారు.
ఇంద్రవెల్లి ఘటన తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. గతంలో కుమ్రం భీము పోరాటం తర్వాత నిజాం ప్రభుత్వం మాదిరే ఆదివాసీల అసంతృప్తి చల్లార్చేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గతంలో ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసి అనుభవం, నిబద్ధత కలిగిన అధికారులను ఉట్నూర్ ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ)లో నియమించింది.
గోండీ భాషలో సమస్యలు విని అర్థం చేసుకుని పరిష్కరించేందుకు వీలుగా డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న గోండ్ తెగకే చెందిన మడావి తుకారాంను అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ, జనరల్) గా నియమించింది.గోండ్ జాతి పెద్దలతో సలహా కమిటీ ఏర్పాటు, సాగు నీరు వసతిలో భాగంగా 3500 వ్యవసాయ బావుల తవ్వకం, సెరీ కల్చర్, హార్టీకల్చర్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నాలు జరిగాయి.
నిరక్షరాస్యులైన ఆదివాసీలకు దరఖాస్తులు రాసి సమస్యలు అధికారుల దృష్టికి తేవడానికి చదువుకున్న స్థానిక ఆదివాసీ యువకులను ‘గోండ్ వెల్ఫేర్ ఆర్గనైజర్లు’గా నియమించారు. ఫారెస్ట్ గార్డ్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల సంఖ్య పెరిగింది. ఆదివాసీల భూముల సరిహద్దు వివాదాల పరిష్కారంలో భాగంగా ‘పట్టా మ్యాపింగ్’ చేసి ఇచ్చారు. అన్యాక్రాంతం అయిన ఆదివాసీల భూముల సమస్యల పరిష్కారం, వడ్డీ వ్యాపారుల రుణాల నుండి విముక్తి కోసం ప్రత్యేక అధికారిని నియమించారు.