గత కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో మరింత తీవ్రమైంది. ఒకదానిపై ఒకటి భారీ టారిఫ్లు (100% కంటే ఎక్కువ) విధించడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దిగజారాయి. ఈ క్రమంలో అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. అమెరికా, చైనా మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధాన్ని నివారించేందుకు జరిపిన చర్చల్లో కొంత పురోగతి సాధించామని తెలిపారు. అయితే, జెనీవాలో రెండు రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ముగిసిన తరువాత ఒప్పంద గురించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
చర్చల వివరాలను సోమవారం వెల్లడిస్తామని బెసెంట్ పేర్కొన్నారు. ఈ చర్చల వివరాలను అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా తెలుసుకున్నారని కూడా చెప్పారు. ఈ చర్చల్లో అమెరికా తరఫున బెసెంట్తో పాటు వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రియర్.. డ్రాగన్ తరఫున చైనా వైస్ ప్రీమియర్ హే లిఫెంగ్, ఇద్దరు చైనా డిప్యూటీ మంత్రులు పాల్గొన్నారు. ఈ చర్చల ముగింపును ‘చైనా భాగస్వాములతో కుదుర్చుకున్న ఒప్పందం’గా వర్ణించారు. ఇది 1.2 ట్రిలియన్ డాలర్లు అమెరికా అంతర్జాతీయ వస్తు వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు.
ఇటీవల వైట్హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన మాట్లాడుతూ.. చర్చల్లో పాల్గొనడానికి చైనా సిద్ధంగా ఉందని, అమెరికాతో వాణిజ్య సంబంధాలను సమతుల్యంగా చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. త్వరలోనే ఇతర దేశాలతో కూడా విదేశీ వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాణిజ్య సంబంధాలను పునఃస్థాపించడంలో బీజింగ్ ఆసక్తిగా ఉందని చెప్పారు.
ఇదే సమయంలో, ట్రంప్ కూడా చర్చలపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. ‘చర్చలు స్నేహపూర్వకమైన, కానీ నిర్మాణాత్మకమైన విధంగా జరిగిన ప్రక్రియ’ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ‘చైనాతో స్విట్జర్లాండ్లో జరిగిన సమావేశంలో అనేక విషయాలు చర్చించాం.. చాలా అంశాలపై ఒప్పందానికి వచ్చాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇరు దేశాలకు ప్రయోజనం జరిగేలా అమెరికా వ్యాపారానికి చైనా తలుపులు తెరుచుకోవాలని మేము కోరుకుంటున్నాం. గొప్ప పురోగతి సాధించాం!!!” అని ట్రంప్ వివరించారు.