టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్లపై ఈడీ ఇటీవల జరిపిన సోదాల నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడినట్టు సమాచారం. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ED అధికారులు మహేష్ బాబును ఆదేశించినట్లు తెలుస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ తమ ప్రాజెక్టులకు ప్రచారం చేసినందుకు గాను మహేష్ బాబుకు రూ. 5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ. 3.4 కోట్లు చెక్కుల ద్వారా, మరో రూ. 2.5 కోట్లు నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టినట్లు సమాచారం. ఈ నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇది మనీ లాండరింగ్కు సంబంధించిన అంశమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ED ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె.సతీష్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా తదితరులు కొనుగోలుదారులను మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించడం, ఒకే ప్లాటును పలువురికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు ఉన్నాయి.
మహేష్ బాబు సాయి సూర్య ప్రాజెక్టులను ప్రచారం చేయడం వల్ల చాలా మంది ఆ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారని, అయితే ఆ సంస్థ మోసపూరిత కార్యకలాపాల గురించి వారికి తెలియదని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ కుంభకోణంలో మహేష్ బాబు నేరుగా పాల్గొనకపోయినా, ఆయనకు అందిన డబ్బుపై ఈడీ ఆరా తీస్తోంది.