అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ఘోర ప్రమాదం లో ఒక పర్యాటక హెలికాప్టర్ అనుకోకుండా నదిలో కుప్పకూలింది. ప్రమాదంలో జర్మనీలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్, ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు.
సీమేన్స్ కంపెనీ స్పెయిన్ శాఖాధిపతి అగస్టిన్ ఎస్కోబార్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి న్యూయార్క్కు పర్యటన నిమిత్తం వచ్చారు. వీరంతా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది పైనుండి ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి గాల్లో తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. పడిన కొద్దిసమయంలోనే హెలికాప్టర్కి మంటలు అంటుకోవడంతో అంతర్గతంగా ఉన్నవారు బయటకు రావడానికీ అవకాశం లేకుండా పోయింది.
ఈ ప్రమాదంలో ఎస్కోబార్తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు,పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ హెలికాప్టర్ “బెల్ 206” మోడల్కి చెందినదిగా గుర్తించగా, ఇది న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ సంస్థ ద్వారా పర్యాటకుల కోసం సైట్ సీయింగ్ ప్రయాణాల నిమిత్తం వినియోగించబడుతోంది. ప్రమాద ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు బోట్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
హెలికాప్టర్ పూర్తిగా నీళ్లలో తలకిందులుగా చిక్కుకుపోయిందని వారు పేర్కొన్నారు. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయినట్లు కూడా అధికారులు తెలిపారు. ఈహృదయవిదారక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్గా మారాయి.ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.