వాషింగ్టన్: సైనికపరంగా ఉక్రెయిన్ కు వెళ్లాల్సిన సాయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
తనతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఇది తక్షణం అమల్లోకి వచ్చింది. దీంతో కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ దిగివచ్చారు. ఇటీవల ట్రంప్ చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తమ దేశ ఖనిజాలను అమెరికా తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనన్నారు. ట్రంప్ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్ కు ఐరోపా దేశాలు బాసటగా నిలుస్తున్న తరుణంలో మంగళవారం ఈ పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి.
ట్రంప్ తాజా నిర్ణయంతో ఆయుధాలు, ఇతరత్రా యుద్ధసామగ్రి రూపంలో దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైనవి ఉక్రెయిన్ ను వెళ్లాల్సి ఉండగా అవన్నీ నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ కట్టుబడి ఉందని ట్రంప్ సంతృప్తి చెందేవరకు తమ నుంచి ఆ దేశానికి సాయం అందబోదని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించినట్లు ‘ది న్యూయార్క్ ‘టైమ్స్’ పత్రిక కథనం తెలిపింది. జెలెన్స్కీ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. కాలమే కొన్నింటిని సరిదిద్దుతుందన్నారు. “శుక్రవారంనాటి సమావేశం జరగాల్సిన రీతిలో జరగలేదు. అది దురదృష్టకరం. దీనిని సరిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై ఇలాంటి చర్చలు, సహకారం నిర్మాణాత్మకంగా ఉండేలా చూసుకుంటాం. ట్రంప్ సర్కారు కోరుతున్న రీతిలో అరుదైన ఖనిజాల తవ్వకాలపై సంతకాలు చేయడానికి మేం సిద్ధం. దీంతోపాటు మా భద్రతపై ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా సంతకాలకు తయారుగా ఉన్నాం. ఎంతో భద్రత కల్పించి, ఖాయమైన హామీలు ఇవ్వడానికి ఇది సమర్థంగా పనిచేస్తుందనే ఆశాభావంతో ఉన్నాను. అంతూపొంతూ లేని యుద్ధాన్ని ఎవరూ కోరుకోవట్లేదు” అని జెలెన్స్కీ చెప్పారు. ఖైదీల విడుదలకు సిద్ధమేనని, సముద్రమార్గంలో, వాయుమార్గంలో యుద్ధ విరమణకు సుముఖమేనని ప్రకటించారు. ఇంతకాలం తమకు మద్దతుగా నిలుస్తున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.