400 ఎకరాల టీజీఐఐసీ భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయం, గచ్చిబౌలి స్థలం అమ్మకానికి ఏర్పాట్లు, 20 వేల కోట్ల సమీకరణకు నిర్ణయం, కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు, బిడ్ల దాఖలుకు 15వ తేదీ వరకు గడువు, గతంలో అదే జాగను సర్కారు తనఖా, ఖజానాలో కాసులు లేక ఆపసోపాలు, విలువైన భూములను అందినకాడికి అమ్ముకునేందుకు సర్కారు యత్నం.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం పరిధిలో టీజీఐఐసీకి చెందిన 400 ఎకరాల భూములను విక్రయించేందుకు యత్నిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి లేఔట్ను ఏర్పాటు చేసి వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి (ఆర్ఎఫ్పీ) టెండర్లు పిలిచింది. లేఔట్ మాస్టర్ ప్లాన్ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేలం ద్వారా ప్లాట్ల విక్రయాలు తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం లావాదేవీ సలహా కన్సల్టెంటు నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ని ఆహ్వానించారు.
ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువిచ్చారు. క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పద్ధతిలో బిడ్డర్ను ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే.. ఇవే భూములను బ్యాంకర్లకు కుదువ పెట్టి రూ.10 వేల కోట్ల రుణాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం గతంలో యత్నించింది. ఒక కన్సల్టెంట్ను నియమించింది. 400 ఎకరాలను ప్రైవేటు బ్యాంకులకు కుదువపెట్టి నిధులు సమీకరించుకుంది. ఆ సమయంలో జరిగిన ఒప్పందంలో ఒక క్లాజ్ పెట్టారు. తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఇవే భూములను విక్రయించి అప్పు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. అనుకున్నట్టే ఇప్పుడు ఇవే భూములను అమ్మడానికి సిద్ధమైంది.