తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో.. మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 27న ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ ఇటీవలే అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ‘తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలది ఇక నుంచి ఒకే మాట, ఒకే బాట.. అదే సమ్మెబాట’ అని అన్ని సంఘాలు నాడు తీర్మానించాయి. మే 7 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని జేఏసీ కోరింది. యూనియన్ల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను, భేషజాలను విడనాడి జేఏసీతో కలిసి రావాలని, కార్మిక ప్రయోజనాల పరిరక్షణతోపాటు ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలని కోరారు.