తెలంగాణ ప్రజాప్రతినిధులకు TTD శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈనెల 24 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం, మంగళవారాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్స్ లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనుంది టీటీడీ. అలాగే బుధ, గురువారాల్లో ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఒక్క ప్రజాప్రతినిధి లేఖపై 6 మంది భక్తులకు దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలపై ఇప్పటికే మంజూరు చేస్తున్న నాలుగు రోజులతో పాటు మరో రోజు అదనంగా బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఇకపై ఆదివారం కూడా బ్రేక్ దర్శనం మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతిమేరకు ఫిబ్రవరిలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశదర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయినప్పటికీ గత రెండునెలలుగా టీటీడీ అధికారులు పరిపాలనాపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బ్రేక్ దర్శనం మంజూరు చేసేందుకు అంగీకరించలేదు. అయితే రెండురోజుల క్రితం అమరావతిలో జరిగిన శ్రీవారికళ్యాణం నేపథ్యంలో ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి త్వరితగతిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు, ప్రత్యేక ప్రవేశదర్శనాన్ని కల్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాబోయే సోమవారం (ఈనెల 24) నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాన్ని మంజూరు చేసేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. దీంతో ఈనెల 24 నుంచి సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, బుధ, గురువారాల్లో ప్రత్యేక దర్శనాలను కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.