అమెరికాలోని వాషింగ్టన్లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది దారుణ హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ DC క్యాపిటల్ జ్యూయిష్ మ్యూజియం సమీపంలో బుధవారం సాయంత్రం ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిని ఓ దుండగుడు అతి సమీపం నుంచి కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్ సిబ్బంది మరణించినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఎక్స్ మాధ్యమంలో తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నట్టు చెప్పారు.
కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అమెరికా పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం ఉందని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ప్రతినిధి తాల్ నయీమ్ అన్నారు. అమెరికాలో తమ సిబ్బందికి భద్రత కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. FBI వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్కు కొన్ని అడుగుల దూరంలోనే కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను యూదు వ్యతిరేక ఉగ్రవాదంగా ఐరాస ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ అభివర్ణించారు.
మరోవైపు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి దాడులకు మగింపు పలకాలన్న ఆయన, జాతి వ్యతిరేకతకు అమెరికాలో తావు లేదని పేర్కొన్నారు.