పాలస్తీనా ఉగ్రవాదసంస్థ హమాస్కు మద్దతు ఇచ్చినందుకు వీసా రద్దుకావడంతో, ఓ భారతీయ విద్యార్థిని తనంతట తానుగా ఆమెరికాను వీడారు (స్వీయ బహిష్కరణ). కొలంబియాలో యూనివర్సిటీలో చదువుకుంటున్న రంజనీ శ్రీనివాసన్, సీబీపీ హోమ్ యాప్ సాయంతో మార్చి 11న దేశాన్ని వీడారు. భద్రతాకారణాల రీత్యా అమెరికా విదేశాంగశాఖ ఆమె వీసాను మార్చి 5న రద్దు చేసింది. ఈ విషయాన్ని హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టీ నోయెమ్ ధ్రువీకరించారు. రంజనీ ఎయిర్పోర్టులో ఉన్నప్పుడు తీసిన వీడియోను నెట్టింట పంచుకున్నారు.
అమెరికాలో చదువుకోవటానికి వీసా మంజూరు చేయటం అనేది హక్కు, గౌరవంతో కూడిన అంశం. చదువుకోవటానికి వచ్చి.. హింస, ఉగ్రవాదాన్ని సమర్థించినప్పుడు వీసా హక్కును రద్దుచేయటం అనేది సరైన నిర్ణయం. అలాంటివారు దేశంలో ఉండకూడదు. కొలంబియా యూనివర్సిటీలో ఉగ్రవాద సానుభూతిపరులలో ఒకరు తనకుతాను స్వీయ బహిష్కరణకు CBP హోం యాప్ ను ఉపయోగించటం చూసి నేను సంతోషంగా ఉన్నాను, అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వింగ్ కార్యదర్శి క్రిస్టినోయెమ్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. మార్చి 5వ తేదీన రంజని శ్రీనివాసన్ వీసా రద్దు అయితే, మార్చి 11న ఆమె అమెరికా నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చేసింది. ఈ విషయాన్ని అమెరికా ప్రకటించింది.
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో అర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్ కోర్సులో డిగ్రీ చదువుతున్న భారతీయ స్టూడెంట్, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ డిజైన్ లో మాస్టర్స్ చేశారు. శ్రీనివాసన్ ఇండియాలోని CEPT (సెంటర్ ఫారన్ ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్) లో డిగ్రీ చేశారు. ఇది గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఉంది. ఇంతకీ రంజనీ శ్రీనివాసన్ అమెరికా నుంచి బయలుదేరి ఇండియాలో ఎక్కడ దిగింది? ఆమెది ఏ రాష్ట్రం? ఆమె కుటుంబసభ్యుల వివరాలు ఏంటీ? అనే విషయాలను మాత్రం అమెరికా వెల్లడించలేదు.