అమెరికాలో చట్టాలను ఉల్లంఘించిన కారణంగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను (USA Visa) రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ బీబీసీకి తెలిపింది. ఈ వీసాల్లో దాదాపు 4,000 వీసాలు దేశ చట్టాలను ఉల్లంఘించడం, దాడులు, మత్తులో డ్రైవింగ్ (DUI), దోపిడీ వంటి నేరాల కారణంగా రద్దయ్యాయి. అలాగే, ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనలిటీ యాక్ట్ (INA 3B) కింద ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి 200-300 వీసాలు రద్దు చేయబడ్డాయి, ఇందులో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేసిన విద్యార్థులను ట్రంప్ పరిపాలన యాంటీసెమిటిజం (యూదులపై వ్యతిరేకత)గా ఆరోపిస్తూ లక్ష్యంగా చేసుకుంది. ఈ చర్యలు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో వెలుగులోకి వచ్చాయి.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికా ఉన్నత విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టారు. ప్రముఖ విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని కఠిన విధానాలు అమలు చేశారు, ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. జనవరిలో యాంటీసెమిటిజంను అరికట్టే బిల్లు ఆమోదించబడింది. దీని ప్రకారం పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేసే విద్యార్థులను దేశ బహిష్కరణకు గురిచేయవచ్చు. జూన్లో విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసి, తిరిగి ప్రారంభించినప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినతరం చేశారు. విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, వాటిలోని పోస్టులు, కామెంట్లు, లైక్లను అధికారులు పరిశీలించి, జాతీయ భద్రతకు ముప్పు లేనట్లయితేనే వీసా ప్రక్రియను కొనసాగిస్తారు.
అలాగే, కీలక విశ్వవిద్యాలయాలకు పరిశోధన నిధుల కోత విధించారు. పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న చాలామంది విద్యార్థులను అరెస్టు చేయించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థుల నియామకాలను నిషేధించడంతో ట్రంప్ పరిపాలనతో న్యాయపోరాటం ప్రారంభమైంది. 2023-24 విద్యాసంవత్సరంలో 1.1 మిలియన్ల మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారని, వారి ద్వారా 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని NAFSA అసోసియేషన్ తెలిపింది.


