రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలనే వాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే లేవనెత్తిన ఈ అంశానికి కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పందిస్తూ ఆ పదాలను తొలగించాలనే వాదనకు మద్దతు తెలిపారు.
ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్, లౌకిక అనే పదాలను చేర్చినందుకు కాంగ్రెస్ను విమర్శించారు. ఇది వేల సంవత్సరాలుగా ఈ దేశ నాగరికత, సంపద, జ్ఞానాన్ని తక్కువ చేయడమేనని అన్నారు. ఇది సనాతన స్ఫూర్తికి అపచారమని పేర్కొన్నారు. ఈ మార్పులు అస్తిత్వ సవాళ్లను కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రవేశికను రాజ్యాంగ ఆత్మగా అభివర్ణించిన ఆయన, రాజ్యాంగంలోని దీనిని మార్చలేమని పేర్కొన్నారు. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి బీజం వంటిదని అన్నారు. సోషలిస్ట్, లౌకిక పదాలు ప్రవేశికలో ఉంచాలా, వద్దా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది.