తమిళ మ్యాగజైన్ వికటన్ వెబ్సైట్ను బ్లాక్ చేసినట్లు వార్తలు. Information & Broadcasting Ministry నుంచి దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని వికటన్ స్పష్టం. బ్లాక్ చేయడాన్ని ‘ఫాసిస్ట్’ చర్య అన్న ముఖ్యమంత్రి స్టాలిన్.
ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ఇప్పుడు నేరమా? మీడియా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయా? వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తపరిస్తే కఠిన చర్యలు తప్పవా? చర్యలు తీసుకునే ఇలాంటి పరిస్థితి ఎక్కడికి దారి తీస్తోంది? మీడియా స్వేచ్ఛను అణిచివేయాలనే ప్రయత్నాలు ఎంతవరకు న్యాయమైనవి?
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ‘ఇండియా ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది’ అని చెప్తున్నారు. ఐతే, అందుకు భిన్నంగా దేశంలో చర్యలు కనిపిస్తున్నాయి. మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం సహించలేకపోతుందనే వాదనలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి.
ఏం జరిగింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో, నరేంద్ర మోదీ సంకెళ్లతో కూర్చొని ఉన్న ఒక కార్టూన్ ని తమిళనాడులోని ప్రముఖ వెబ్సైట్ ‘వికటన్’ ప్రచురించింది. వికటన్ ప్లస్ అనే ఒక ప్రత్యేక విభాగంలో పబ్లిష్ చేసిన ఆ కార్టూన్ వల్ల తమ వెబ్సైట్ను శనివారం రాత్రి బ్లాక్ చేశారని ఆ మాగజైన్ యాజమాన్యం ఆరోపించింది.
ఫిబ్రవరి 10న వికటన్ ప్లస్ మాగజైన్లో ప్రచురించిన ఈ కార్టూన్, అమెరికాలో హ్యాండ్కఫ్స్ వేసి భారతీయులను పంపించడాన్ని గురించి ప్రధాని మోదీ మాట్లాడకపోవడాన్ని గుర్తుచేస్తూ ఉంది. భారతీయులకి ప్రతినిధిగా ఆయన మాట్లాడాల్సి ఉన్నా ఆ పనిచేయకపోవడానికి నిరసనగా స్వయంగా ఆయన్నే సంకెళ్లతో ఉన్నట్లు చూపడం ఆ రాజకీయ పార్టీ వర్గానికి నచ్చలేదు. ఇలాంటి ప్రచురణపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కేంద్రీయ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(I &B)కు ఫిర్యాదు చేసారు. తన ఫిర్యాదులో, వికటన్ మాగజైన్ కావాలనే మోదీగారిని అవమానించేలా కార్టూన్ ప్రచురించినట్లు, అది జర్నలిస్టిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు అందులో మెన్షన్ చేసారు. ఇది ప్రాథమికంగా తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న DMK పార్టీని ప్రసన్నం చేసుకోడానికి చేసిందేనని ఆయన ఆరోపిస్తున్నారు. వెబ్సైట్ బ్లాకింగ్ పై I & B విభాగం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
మీడియా స్వేచ్ఛ – దాని ప్రాథమిక అవసరం
గతంలో మరికొన్ని మీడియా సంస్థలు కూడా ప్రభుత్వ చర్యల బారినపడ్డాయి. 2021లో కాషాయ్ టీవీ చానల్ ప్రభుత్వం పట్ల విమర్శలు చేశారని బ్లాక్ చేయబడింది. అలాగే, BBC డాక్యుమెంటరీని భారతదేశంలో ప్రసారం కాకుండా అడ్డుకోవడం, జర్నలిస్టులపై IT రైడ్స్ వంటి చర్యలు కూడా మీడియా స్వేచ్ఛపై ఒత్తిడిగా భావించబడ్డాయి.
వికటన్ మాగజైన్ తమ వెబ్సైట్ ఎందుకు బ్లాక్ అయిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని, సమాచార మంత్రిత్వ శాఖను సంప్రదిస్తున్నామని అంటోంది. దాదాపు వందేళ్లుగా వికటన్ స్వేచ్ఛా భావాలకు మద్దతుగా నిలబడింది. ఎప్పుడూ స్వేచ్ఛాయుతమైన అభిప్రాయాలను గౌరవించే మీడియా సంస్థగానే పనిచేసినట్టు ప్రకటించింది.
చెన్నై ప్రెస్ క్లబ్, యూనియన్ ఫర్ మీడియా పర్సన్స్ ఫర్ చేంజ్ వంటి పాత్రికేయ సంఘాలు మద్దతుగా నిలబడుతున్నాయి. జర్నలిజంలో కార్టూన్ లది కీలకపాత్ర. సంక్లిష్టమైన అంశాలను ప్రజలకి సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి కార్టూన్స్ పనికొస్తాయి. వికటన్ వెబ్సైట్ను బ్లాక్ చేయడం అంటే దేశంలోని ప్రెస్ ఫ్రీడమ్ను కాలరాయడంగానే చూడాలని, ప్రజలకు విషయాలు అర్థం కాకుండా ఉంచడానికే ఇలాంటి చర్యలకు ప్రభుత్వాలు పాల్పడే ప్రయత్నాలు చేస్తాయనేది వాళ్ళ వాదన.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఈ చర్యపై విమర్శించారు. మీడియా అభిప్రాయాలను వ్యక్తీకరించడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ.. ఈ చర్యను బీజేపీ ఫాసిస్టు ధోరణికి ఉదాహరణగా చూడాలని ఆయన అన్నారు. వెంటనే వికటన్ వెబ్సైట్ పునరుద్ధరించాలని స్టాలిన్ ‘X’లో రెస్పాండ్ అయ్యారు.
ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా నియంత్రించడాన్ని అనుమతిస్తే, ఇలాంటి చర్యల్ని నిరసించాకుండా ఉంటే, మాట్లాడే గొంతుల్ని నొక్కేసి, జైల్లో వేసి, తాళంచెవిని దూరంగా విసిరేయగలని గుర్తుచేసారు ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్.