టర్కీలో ఎయిర్పోర్టులో భారతీయుల తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. లండన్ నుంచి ముంబై వస్తున్న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ (VS1358) ఎమర్జెన్సీగా టర్కీ దియార్ బకిర్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. దీంతో ఫ్లైట్లో ఉన్న 250 మంది ప్రయాణికులు టర్కీ ఎయిర్పోర్ట్ లోనే చిక్కుకున్నారు. 40 గంటలకు పైగా విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఫ్లైట్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఆల్టర్నేటివ్ సర్వీస్ ఏదైనా ఏర్పాటు చేస్తారో లేదో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బుధవారం (ఏప్రిల్ 2) లండన్ నుంచి ముంబై వస్తున్న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులలో ఒకరు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మెడికల్ ఎమర్జెన్సీ కింద టర్కీ దియార్ బకిర్ ఎయిర్పోర్ట్ లో ఆపడం జరిగింది. ఆ తరువాత ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో రద్దు చేశారు అధికారులు. అప్పటి నుంచి ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయారు.
40 గంటలకు పైగా విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సరైన సదుపాయాలు కల్పించలేదని వాపోతున్నారు. కుర్చీలు, సోఫీలు, నేలపైనే పడుకుంటున్నామని, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఎయిర్పోర్టులో ఒకే ఒక టాయిలెట్ ఉందని, 250 మందికి ఒకే టాయిలెట్ కేటాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమను చాలా హీనంగా చూస్తున్నారని, మనుషులాగా కూడా చూడటంలేదని X లో పోస్ట్ చేశారు.
ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. సాంకేతిక లోపంతో ఫ్లైట్ క్యాన్సిల్ చేశామని, టెక్నికల్ అప్రూవల్ వచ్చిన వెంటనే ఫ్లైట్ (VS1358) ను ప్రారంభిస్తామని తెలిపారు. శుక్రవారం (ఏప్రిల్ 4) సాయంత్రం వరకు భారతీయులను ముంబైకి చేర్చుతామని ప్రకటించారు. ఒకవేళ సాయంత్రం వరకు టెక్నికల్ అప్రూవల్ రాకపోతే బస్ ద్వారా మరో తుర్కిష్ ఎయిర్పోర్టుకు తరలించమని చెప్పారు. అక్కడి నుండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.