ఈ నెల రెండు న లండన్ నుండి వర్జిన్ అట్లాంటిక్ విమానం ముంబాయి కి బయలుదేరింది. ఈ విమానంలో మొత్తం 250 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 200 మందికి పైగా భారతీయులు. ఒక మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీ లోని ఓ మారుమూల ప్రాంతంలో వున్న దియార్ బకిర్ ఎయిర్పోర్ట్ లో విమానం లాండ్ అయింది. అయితే లాండ్ అయిన అనంతరం విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో 40 గంటలకు పైగా ప్రయాణీకులు అక్కడే చిక్కుకుపోయారు. ఆ మారుమూల ఎయిర్పోర్ట్ లో సౌకర్యాల లేమితో పాసెంజర్లు అల్లాడిపోతున్నారు. ఒక్కటే టాయిలెట్ వుందని, సెల్ ఫోన్ చార్జింగ్ పాయింట్స్ కూడా లేవని ఆవేదనా చెందుతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, త్వరగా ఆల్టర్నేటివ్ ఎరేంజ్మెంట్స్ చేసి, తమను ముంబాయి పంపించాలని ప్రాధేయపడ్డారు.
ప్రయాణీకుల కష్టాల పట్ల వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ స్పందించింది. తమ ప్రయాణీకులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని చెబుతూ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. ఏప్రిల్ 4న, స్థానిక కాలమానం ప్రకారం 12.00 గంటలకు దియార్ బకిర్ విమానాశ్రయం నుండి ముంబాయి కి విమానం ఏర్పాటు చేస్తామని, ఒకవేళ దానికి పర్మిషన్స్ రాకపోతే పాసెంజర్లను మరొక ఎయిర్పోర్ట్ కి తరలించేందుకు బస్సును ఏర్పాటు చేస్తామని, ఆ తరువాత మరో విమానంలో వారిని ముంబాయి కి పంపిస్తామని, రాత్రివేళలో ప్రయాణీకుల బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వర్జిన్ అట్లాంటిక్ రిప్రజెంటేటివ్ తెలియచేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్ పై అంకారాలోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్, దియార్ బకిర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నది.