ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకున్నది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గూడకూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం వేకువ జామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సింహాచలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాప్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కుప్పకూలింది. ఈదురుగాలులకు భారీ టెంట్ ఎగిరి గోడపై టెంట్ పడడంతో కూలినట్లు తెలుస్తున్నది. ఇటీవలనే రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద భారీ గోడను నిర్మించారు. శిథిలాలల కింద మరికొంత మంది చిక్కుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా సింహాచలం వరాహా లక్ష్మీనరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం ఆ తర్వాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరు చేసి.. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించారు.