ఒక నిమిషం వీడియోకు రూ.90వేలు చార్జ్ చేశామని, ఇలా సుమారు 15 వీడియోలు ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విష్ణుప్రియ, రీతూచౌదరిలు గురువారం పంజాగుట్ట పీఎస్లో విచారణకు హాజరయ్యారు. ఈ ఇద్దరిని రాత్రి తొమ్మిదిగంటల వరకు పోలీసులు విచారించారు. విష్ణుప్రియను సుమారు పదిగంటలపాటు, రీతూ చౌదరిని ఆరుగంటలపాటు పంజాగుట్ట డిఐ శ్రవణ్ ఆధ్వర్యంలో విచారించారు.
ఇద్దరి బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా వచ్చిన నిధులపై ఆరా తీశారు. ఈ క్రమంలో వారెన్నెన్ని వీడియోలు చేశారు, ఒక్కో వీడియోకు ఎన్ని డబ్బులు తీసుకున్నారు అని అడిగారు. ప్రమోషన్ చేయడానికి వారిని ప్రోత్సహించిందెవరంటూ పోలీసులు ప్రశ్నించారు. గురువారం విచారణ పూర్తిఅయిన తర్వాత ఈ ఇద్దరిని ఈనెల 25న మళ్లీ విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు టేస్టీతేజా, కానిస్టేబుల్ కిరణ్లను పోలీసులు విచారించారు.