మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్వయంకృషి నగర్ లో ఓ యువతి, ఆమె తల్లిపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడి యువతి, ఆమె తల్లిపై క్రూరంగా దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి (43) అక్కడికక్కడే చనిపోగా తీవ్రగాయాలైన దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. దీపిక డిగ్రీ చదివి ఇంట్లోనే ఉంటోంది. యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
ప్రేమోన్మాది దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశాఖపట్నం CP Sankhabrata Bagchi (శంఖబ్రత బాగ్చి) తో ఫోన్ లో మాట్లాడి దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రేమోన్మాదిని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.