విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదంటూ వారిని దండించలేదు ప్రధానోపాధ్యాయుడు (Head Master) చింత రమణ. పిల్లల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు సరికొత్త ఆలోచనకు నాంది పలికారు. స్కూల్ పిల్లలందరినీ ఒక్క దగ్గర చేర్చి వారి ముందు తనను తాను శిక్షించుకున్నారు. ఆ విద్యార్థుల ముందే గుంజీలు తీశారు హెడ్మాస్టర్. ప్రస్తుతం హెడ్మాస్టర్ గుంజీలు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే టీచర్లు మందలించడం కామన్. ఒక్కోసారి అల్లరి శృతిమించినా, చదవకపోయినా దండిస్తారు కూడా. కాని ఈ హెడ్మాస్టర్ ఈ విధంగా చేయడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన పని ఏకంగా విద్యాశాఖమంత్రి లోకేష్ (Minister lokesh) దృష్టికి వెళ్లింది. హెడ్మాస్టర్ ఆలోచనకు మంత్రి కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్.. “అంతాకలిసి పనిచేద్దాం” అంటూ ప్రధానోపాధ్యాయుడికి సందేశమిచ్చారు.