భారతదేశంలో సోషల్ మీడియా వినియోగం విషయంలో నిబంధనలను ఆయా సంస్థలు మరింత కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ కోట్ల కొద్ది అకౌంట్లను తొలగించగా, తాజాగా అదే బాటలోకి మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కూడా చేరింది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ 2025 జనవరి 1 నుంచి 30 వరకు ఒక్క నెలలోనే దాదాపు 99 లక్షల (10 మిలియన్లు) భారతీయ ఖాతాలను నిషేధించింది. ఇది కంపెనీకి సరికొత్త రికార్డని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే నెలలో ఈ స్థాయిలో అకౌంట్లను తొలగించడం ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు.
జనవరి 1 నుంచి 30, 2025 మధ్య కాలంలో వాట్సాప్ 99 లక్షల ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలు వివిధ కారణాలతో నిషేధించబడ్డాయి. వాటిలో నకిలీ ఖాతాలు, స్పామ్ సందేశాలు పంపడం, అనుమానాస్పద కార్యకలాపాలు సహా అనేక వాట్సాప్ విధానాలను ఉల్లంఘించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ నిషేధ చర్యలో భాగంగా దాదాపు 13.27 లక్షల ఖాతాలను ముందుగా, యూజర్ ఫిర్యాదులు అందకముందే, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా బ్లాక్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వాట్సాప్ భద్రతా వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుస్తుంది. ఈ క్రమంలో యూజర్లు వాట్సాప్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సందేశాలు పంపిస్తే మీ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
వాట్సాప్ భద్రత కోసం ఇప్పటికే ఆటోమేటెడ్ సిస్టమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇది ఒక వినియోగదారుల కార్యాచరణను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు ఒక ఖాతా నుంచి ఎక్కువమంది యూజర్లకు స్పామ్ సందేశాలు పంపితే లేదా నకిలీ సమాచారాన్ని పంపిస్తే, సిస్టమ్ వెంటనే ఆ ఖాతాను గుర్తించి, చివరకు నిషేధిస్తుంది. ఇటీవల కాలంలో ఆటోమేటెడ్ సిస్టమ్ అనుమానాస్పద అంశాలను త్వరితగతిన గుర్తించి చర్య తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వినియోగదారుల అనుభవాన్ని మరింత సురక్షితంగా, నమ్మకంగా ఉంచడంలో సహకరిస్తుంది.