బీసీసీఐలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. క్రికెట్ అభిమానులను, నిర్వాహకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్లో జరగనున్న బీసీసీఐ ఎన్నికల వరకు రాజీవ్ శుక్లా ఈ పదవిలో కొనసాగనున్నారు. వివరాల ప్రకారం, బుధవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సెల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలోనే జరిగింది. ఇది రోజర్ బిన్నీ రాజీనామా విషయాన్ని మరింత బలపరుస్తోంది. అయితే ఆయన ఎందుకు పదవి నుంచి తప్పుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు చెబుతుండగా, మరికొందరు మాత్రం క్రికెట్ బోర్డు అంతర్గత రాజకీయాలే దీనికి కారణమని అభిప్రాయపడుతున్నారు.
కొత్త లీడ్ స్పాన్సర్ అంశంపై
ఆయన స్థానంలో బీసీసీఐ (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్లో జరగనున్న బీసీసీఐ ఎన్నికల వరకు శుక్లా ఈ పదవిలో కొనసాగుతారు.నేషనల్ మీడియా కథనాల మేరకు బుధవారం నిర్వహించిన బీసీసీఐ అపెక్స్ కౌన్సెల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో జరిగింది.. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో రోజర్ బిన్నీ మళ్లీ పోటీ చేసి గెలిస్తే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో సెప్టెంబర్ తర్వాత బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా టీమిండియా కొత్త లీడ్ స్పాన్సర్ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. డ్రీమ్11తో ఒప్పందం ముగియడంతో భారత జట్టుకు ప్రస్తుతం ప్రధాన స్పాన్సర్ లేరు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ (Asia Cup) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో కొత్త స్పాన్సర్ను ఖరారు చేయడం బీసీసీఐకి పెద్ద సవాలుగా మారింది. “కొత్త టెండర్ పిలిచి, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పడుతుంది.
అందుకే ఆసియా కప్నకు మాత్రమే తాత్కాలిక స్పాన్సర్ను తీసుకునే ఆలోచన లేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు, అంటే సుమారు రెండున్నరేళ్ల పాటు దీర్ఘకాలిక స్పాన్సర్ను తీసుకురావడమే మా లక్ష్యం” అని బోర్డు వర్గాలు స్పష్టం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇటీవల పార్లమెంటులో కొత్త జాతీయ క్రీడా పాలన చట్టం ఆమోదం పొందినప్పటికీ, అది పూర్తిగా అమల్లోకి రావడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కారణంగా సెప్టెంబర్లో జరిగే బీసీసీఐ ఎన్నికలు, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోధా కమిటీ సిఫార్సులతో రూపొందించిన రాజ్యాంగం ప్రకారమే జరుగుతాయని తెలిసింది. ఈ పాత నిబంధనల ప్రకారం, ఆఫీస్ బేరర్ల వయోపరిమితి 70 ఏళ్లుగా ఉండగా, కొత్త చట్టంలో దానిని 75 ఏళ్లకు పెంచే అవకాశం కల్పించారు.