హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇళ్ళనే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే సర్కారు భూములను రక్షించినట్లు అవుతుందని పేర్కొంది. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ళ ఓనర్లకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలను ఎందుకు తొలగించడంలేదని హైడ్రాను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినప్పటికీ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలిపింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగినచర్యలను తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని, పెద్దలనూ తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని నిలదీసింది. ‘పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫొటోలు వేయించుకోవడం కాదు, దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల ఆక్రమణలనూ తొలగించినపుడే ప్రజాప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుంది’ అని పేర్కొంది. మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలుంటే తొలగింపునకు చర్యలు తీసుకోవచ్చంది.