తిరుమల దర్శనం కోసం టీటీడీ అధికారులను అడుక్కోవడం ఎందుకని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందని అన్నారు. ప్రతిసారి ఎమ్మెల్యేల లెటర్లు అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని సూచించారు.
‘‘తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, TTD అధికారులను ప్రతిసారీ అడుక్కోవడమేంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? మనకు భద్రాచలంలో రాముడు లేడా..? మనకు శివాలయాలు తక్కువున్నాయా..? తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు మన తెలంగాణలోని దేవాలయాలకు వెళ్లొచ్చు కదా అని అన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వడంలేదని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని కొందరు నేతలు కోరారు.
అయితే అడుక్కోవడం అని మాట్లాడే బదులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి అందరికి చెందింది. ఇప్పుడు విడిపోయినంత మాత్రాన అక్కడికి వెళ్లడం ఎందుకు ఇక్కడ దేవుళ్ళు లేరా! అని మాట్లాడడం అర్థరహితంగా ఉంది అని మేధావులు, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేది ప్రజలకు సంబందించిన విషయం. రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇక్కడి ప్రజాప్రతినిధుల సిఫారస్ లకు విలువ ఇవ్వాలని అడగడం అనేది అడుక్కోవడం ఎలా అవుతుంది అని ప్రజలు చర్చించుకుంటున్నారు.