గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి హైదరాబాద్ లో స్నేహపురి కాలనీలోని స్వగృహంలో ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల రెండో కుమార్తె కృష్ణభారతి.
బ్రిటీష్ ప్రభుత్వం విధించిన తీవ్ర ఆంక్షలని ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయం మీద జెండా ఎగరేసిన నేరానికి కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులకు 1932 జూన్ లో కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ సంఘటనకి సౌత్ బార్దోలి తిరుగుబాటు అనే పేరు వచ్చింది. జైలుశిక్ష విధించినప్పుడు అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి. అలా వారు కారాగారవాసం అనుభవిస్తుండగా కృష్ణభారతి జైల్లోనే జన్మించారు. కృష్ణుడిలా జైల్లో పుట్టినందుకు కృష్ణ అని, భారతదేశం ప్రతిబింబించేలా భారతి అని రెండుపేర్లు కలిసేలా కృష్ణభారతి అని ఆమెకి తల్లిదండ్రులు పేరు పెట్టారు. ఆమె తొలి పదినెలల బాల్యం కారాగారంలోనే గడిచింది. గాంధీగారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించినప్పుడు కృష్ణమూర్తి ఆయనకి కార్యదర్శిగా పనిచేశారు. పడమర విప్పర్రు గ్రామంలోని తమ మొత్తం ఆస్తిని స్వాతంత్ర్య పోరాట ఉద్యమానికే త్యాగం చేశారు కృష్ణమూర్తి దంపతులు.
అవివాహితగానే వున్న కృష్ణభారతి జీవితాంతం గాంధేయ విలువలతోనే జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందించడంతో పాటు దళితుల్లో విద్యావ్యాప్తికి కృషి చేశారు. 2022 జులైలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని నరేంద్రమోది ఆమెని ప్రత్యేకంగా సత్కరించారు. ఆమెకి పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.