రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ BYD బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలను BYD కంపెనీ ఖండించింది. హైదరాబాద్లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది.
BYD సంస్థ ఇప్పటికే భారత్లో తన కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, ఇక్కడ సొంత ఉత్పత్తి యూనిట్ లేదు. ప్రస్తుతం చైనాలో ఉత్పత్తి చేసిన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల అధిక సుంక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో, భారత్లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా BYDతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్ సమీపంలో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఈ కథనాలు సంస్థ దృష్టికి వెళ్లటంతో, ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కంపెనీ స్పష్టం చేసింది.
BYD హైదరాబాద్లో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని సుమారు రూ.70 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. BYD కంపెనీ పెట్టుబడితో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఈ కంపెనీ హైదరాబాద్కు వస్తే, దేశీయ EV రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కూడా అందరూ ఆలోచించారు.