ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అమరావతి రాజధాని అభివృద్ధిపై అనవసరమైన అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీర్ఘకాలిక దృష్టితో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు .
అమరావతిలో ₹64,000 కోట్ల విలువైన 92 అభివృద్ధి పనులకు అనుమతి లభించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ పనుల్లో ₹45,000 కోట్ల విలువైన టెండర్లు గత రెండు వారాల్లో ఖరారు చేయబడ్డాయి . రాజధాని నిర్మాణాన్ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది .
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూ సమీకరణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి నారాయణ తెలిపారు. భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని, అదనపు భూమి అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు .
అమరావతి కోసం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమిని లాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సమీకరిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగబోతుందని వైసీపి మీడియా వార్తలు రాస్తున్న నేపథ్యంలో మంత్రి పి.నారాయణ ప్రకటన ప్రాముఖ్యతని కలిగివున్నది. రైతులు భయపడాల్సిన అవసరం లేదని, భూముల విలువ తగ్గుతుందనే అపోహలు వ్యాప్తి చేయవద్దని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు .