ఏపీలో తిరుమల టీటీడీ బోర్డు పరిధిలో అన్యమతస్తులు పనిచేయకుండా తొలగిస్తామని గతంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ ఓ విద్యాసంస్ధలో ప్రిన్సిపాల్ స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జి.అసుంతను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తూ పూజ చేయకుండా, హారతి ఇవ్వకుండా, తీర్థ ప్రసాదాలు తీసుకోని అసుంతపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆమెను డిప్యూటేషన్ పై నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది. టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వైఎస్ హయాంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగుల్ని టీడీడీలో నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి తొలగింపుకు ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.